ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న దంపతులు ...
తిరువంతపురం: కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పుడు ఆన్లైన్ పెళ్లిళ్లు తెరపైకి వస్తున్నాయి. 'పాట రోజుల్లో పెళ్లంటే అటేడుతరాలు, ఇటేడుతరాలు గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా వారం రోజులపాటు చేసేవారు. ఆ తర్వాతపెళ్లి తంతు ఒక్కరోజుకు మారింది. అయితే గతంతో పోలిస్తే ఖర్చు మాత్రం పెరుగుతూ వచ్చింది. స్తోమతను బట్టి వందలు, వేళల్లో జనం హడావిడి మాత్రం యధావిధిగా జరుగుతోంది. కొన్ని పెళ్లిళ్లు వధూవరులు ఉంటె చాలన్నట్లు జరుగుతుంటాయి. అయితే కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లంటే వధూవరులు కూడా పక్కన, ఒక చోట ఉండాల్సిన పని లేకుండా పోయింది. ఎవరెక్కడ ఉన్నా వారి చేతిలో ఫోన్ ఉంటే చాలు పెళ్లి చిటికెలో పని అయిపోతుంది. ఇదేంటని ఒకింత ఆశ్చర్యం కలిగినా ఇది నిజం.
వివరాల్లోకి వెళితే .... తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఫోన్లోనే పెళ్లిచేసుకొని ఆన్లైన్ పెళ్ళికి శ్రీకారం చుట్టింది. . కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీజిత్ అలప్పుజాలో వధువు అంజనా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ వధువు తండ్రి ఉండగా, పెళ్లికూతురు, ఆమె తల్లి, సోదరుడు లక్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వధూవరులిద్దరూ పెళ్లి బట్టలు ధరించి ఫోన్లో లైవ్లోకి వచ్చారు. వెంటనే తాళిబొట్టు చేతపట్టుకుని వరుడు ఫోన్కు వెనకవైపున కట్టాడు. అటు వధువు తల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. ఈ తతంగం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత రిసెప్షన్తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ జరుపుతామని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్లడించాడు. ఎన్ని అడ్డంకులెదురైనా తాము అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకున్నామన్న సంతృప్తి వారిలో వ్యకమవుతోంది.
Comments
Post a Comment