అంతర్ రాష్ట్ర రహదారి దిగ్బంధం...
గూడెంకొత్తవీధి (జన హృదయం) : సీలేరు విశాఖ జిల్లా ఆర్వీనగర్ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగెడ్డ వరకు ఉన్న శిథిలావస్థితిలో ఉన్న అంతర్రాష్ట్ర రహదారి పై అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా గూడెంకొత్తవీధి మండల బంద్ విజయవంతంగా జరిగింది. బంద్ వల్ల అంతర్రాష్ట్ర రాకపోకలునిలిచిపోయాయి. అఖిలపక్షనాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హజరయ్యారు. అటు మండల కేంద్రం వద్ద , ఇటు సీలేరు వద్ద నున్న అంతర్ రాష్ట్ర కూడలిలో అఖిలపక్ష నాయకులు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై వంటావార్పు చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా, ధారకొండ, సప్పర్ల వద్ద కూడా ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలుపెట్టి, రాళ్లు పెట్టి రాకపోకలకు ఆటకం కల్పించారు. ఈ రహదారిపై కనికరించండంటూ ఎన్ని సార్లు అధికారులను కలిసి మొరపెట్టకున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో మండలంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలో వ్యాపారసంస్థలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జెన్కో కార్యాలయాలు మూతబడ్డాయి. మరో వైపు ఆంధ్రా-ఒడిశా రహదారిని దిగ్భందనం చేసి రాకపోకలు నిలిపివేశారు. రహదారిపై వంటావార్పు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించిపోయింది. ఒక వైపు ఒడిశా, మరో వైపు విశాఖ, భద్రాచలంకు వెళ్లే రహదారులు స్థంబించాయి. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల్లో , బస్సుల్లో ఉన్నవారు కూడా ఆందోళన చేస్తున్న వారితో జతకలిసి నినాదాలు చేశారు.
Comments
Post a Comment